తిరుమలలో అన్య మత చిహ్నం ఉన్న స్టిక్కర్తో ఒక వాహనం సంచరించడం ఆలయ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. తిరుమల కొండపై ఆ వాహనం కనిపించడంతో టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఈ విషయంపై తిరుమల రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు చర్యలు తీసుకుని, వాహనం డ్రైవర్ గోబి మరియు వాహన యజమానిపై AP Charitable & Hindu Religious Institutions and Endowments Act – 1987లో కేసు నమోదు చేశారు. ఈ వాహనం తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాకు చెందినదిగా, నెంబర్ TN-31-AE-4073గా గుర్తించారు.
చెక్పోస్ట్ వద్ద నిర్లక్ష్యం
గురువారం ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్పోస్టులోని 9వ లేన్ గుండా ఈ వాహనం ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు వాహనంపై ఉన్న అన్య మత చిహ్నాన్ని గమనించకపోవడం టీటీడీ అధికారులను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యానికి గాను వాసు బాబును వెంటనే అలిపిరి విధుల నుండి తప్పించి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు టీటీడీ వెల్లడించింది.
వాహనం గుర్తింపు – స్టిక్కర్ తొలగింపు
సమాచారం అందుకున్న వెంటనే, విజిలెన్స్ టీమ్ తిరుమలలో ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఆ వాహనాన్ని గుర్తించింది. అనంతరం వాహనంపై ఉన్న అన్య మత స్టిక్కర్ను తొలగించారు. తరువాత అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేశారు.
టీటీడీ ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేస్తూ, తిరుమల పవిత్రతను భంగం చేసే ప్రయత్నాలపై ఎటువంటి రాజీ ఉండదని హెచ్చరించింది.