బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఢాకాలోని ప్రత్యేక కోర్టు సోమవారం హసీనాకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు మరియు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల శిక్షలు ప్రకటించాయి. ఢాకా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ సంచలన తీర్పు వెలువరించారు.
విచారణ సమయంలో నిందితుల ముగ్గురూ కోర్టుకు హాజరుకాలేదు. ఇదే కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా ఐదేళ్ల జైలు శిక్షను విధించారు. మొత్తం 17 మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించగా, జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలల జైలుశిక్షను అనుభవించాలని ఆదేశించారు. పూర్బాచల్ భూ కేటాయింపు వ్యవహారంపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ మొత్తం ఆరు కేసులు నమోదు చేసుకుంది.
ఇది షేక్ హసీనాపై వచ్చిన తొలి శిక్షేమీ కాదు. గత నవంబర్ 27న ఇదే తరహా అవినీతి కేసులో మరో కోర్టు ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అదేవిధంగా అల్లర్ల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చి వందలాది మంది మరణాలకు కారణమయ్యారన్న కేసులో ఆమెకు మరణశిక్షను కూడా ప్రకటించారు.
తాజా తీర్పుపై షేక్ హసీనా కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు. తమపై మోపిన అవినీతి ఆరోపణలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని వారు ఖండించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవినీతి నిరోధక కమిషన్ను తమ అనుకూలంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పక్షపాత సాక్ష్యాలతో వారిని ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన కుటుంబసభ్యులు, తమ వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు.