‘మోసగాళ్లు’ చిత్రంలో అన్నా చెల్లెలుగా మంచు విష్ణు, కాజల్
చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ‘మోసగాళ్లు’ చిత్రాన్ని మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్ర బృందం సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రంలో కాజల్, మంచు విష్ణుకి జోడిగా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కాని, ఈ చిత్రంలో విష్ణు, కాజల్ అన్న చెల్లెలుగా నటిస్తున్నారట. అవును ఈ విషయాన్ని తాజాగా ఈ చిత్ర నిర్మాత, హీరో మంచు విష్ణు, రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రంలో కాజల్ ‘అను’ అనే పాత్రను పోషిస్తోంది. హ్యాపీ రాఖీ ‘అను’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.
కాగా, ఈ చిత్రాన్ని లాస్ ఏంజెల్స్కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఇందులో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అసలు ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది.