భరతమాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు : భగత్ సింగ్

భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.. చిన్నతనం నుంచి స్వాతంత్ర కాంక్షతో రగిలిపోయి బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి భరతమాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్‌తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా.. వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా. చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖ‌లాల‌ నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్‌గా జరుపుకొంటూ.. ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్‌లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఉంది. అతడి తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్.. స్వామి దయానంద సరస్వతి అనుచరుడు. ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. తాత ప్రభావం భగత్ సింగ్‌పై ఎక్కువ. గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు.

గాంధీ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా.. భగత్ సింగ్ మాత్రం బ్రిటిషర్లను దెబ్బకు దెబ్బ కొట్టాలని భావించేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతంతో భగత్ సింగ్.. బ్రిటిషర్ల పట్ల కోపాన్ని పెంచుకున్నాడు. లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్.. పెళ్లిని తప్పించుకోవడం కోసం ‘నా జీవితాన్ని దేశం కోసమే అకింతం చేస్తాను.. నాకు మరో కోరిక లేదు’ అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయాడు. తర్వాత నవ జవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. యువతలో స్వరాజ్య కాంక్షను రగిల్చాడు. అనంతరం హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. భగత్ సింగ్, సుఖ్ దేవ్ మిత్రులయ్యారు. వీరిద్దరూ అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా.. లాహోర్లో లాలా లజపతి రాయ్ ఆందోళన చేపట్టగా.. బ్రిటిష్ పోలీసు సూపరిడెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్‌పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి లాలా లాజపతి రాయ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు.. బ్రిటిషర్లపై ఆగ్రహం పెంచుకున్నారు. సాండర్స్‌ను కసితీరా కాల్చి చంపారు.

1929లో ఈ ముగ్గురూ పార్లమెంటుపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. సాండర్స్‌ను హత్య చేసినందుకు గానూ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిపై హత్యానేరం మోపింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఏ మాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అనంతరం వారి శవాలను సగం కాల్చి సట్లెజ్ నదిలో విసిరేశారు. అక్కడే ఓ స్మారకాన్ని నిర్మించారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులను ఉరి తీసిన హుస్సైనీవాలాతోపాటు‌గా భగత్ సింగ్ జన్మించిన ఖాత్కర్ కలాన్‌‌లో ఏటా మార్చి 23న షాహిదీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. లాహోర్‌లోనూ ఘనంగా భగత్ సింగ్‌కు నివాళులు అర్పిస్తారు. పాకిస్థాన్‌తోపాటు ఇటు భారత్‌లోనూ ప్రతి ఒక్కరూ షాహిదీ దివస్ సందర్భంగా భగత్ సింగ్‌ సేవలను స్మరించుకుంటున్నారు.